అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు, నిజాలు మాట్లాడాలి: మంత్రులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
హన్మకొండ/కమలాపూర్, వి90 న్యూస్, ఆగస్టు 10: కమలాపూర్లో కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రులు రాజకీయ విమర్శలు చేయడంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజకీయాలు చేసే వేదిక కాదని, ప్రజల ముందు వాస్తవాలే మాట్లాడాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లకు స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేవలం ప్రారంభించి వెళ్లడం కాకుండా కాలనీల్లో డ్రైనేజీ, విద్యుత్, రోడ్ల సమస్యలతో పాటు కనీస మౌలిక వసతులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. మిగిలిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని, లబ్ధిదారులు చిన్నచిన్న పనులు చేసుకునేందుకు వీలుగా ఒక్కొక్కరికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని వేదికపై నుంచే మంత్రులను కోరారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన మహిళలకు నెలకు 2,500 రూపాయలు, కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం, పింఛన్ల పెంపు అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కమలాపూర్ బస్స్టాండ్ పూర్తికి 2 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. ఉప్పల్, చల్లూరు గ్రామాలకు మండల హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

