జమ్మికుంటలో వరద నీటి సమస్యల నివారణకు జేసీబీ పనుల ప్రారంభం: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 17: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జమ్మికుంట పట్టణ పరిధిలోని 15వ వార్డులో వరద నీటి సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్( దిలీప్) ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వార్డులో కచ్చా కాలువలు తీసే పనులను ఆయన జేసీబీ ద్వారా గురువారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, పట్టణ పరిధిలోని మొత్తం 30 వార్డులలో రానున్న వర్షాకాలంలో ఎలాంటి వరద నీటి సమస్యలు, డ్రైనేజీ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఒక మున్సిపల్ జేసీబీతో పాటు మరో రెండు ప్రైవేట్ జేసీబీలను లీజుకు తీసుకున్నట్లు వెల్లడించారు.ముందుగా మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలైన ధర్మారం, రామన్నపల్లి లలో ఈ పనులను ప్రారంభించామని, విడతల వారీగా అన్ని వార్డులలోని పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తమ నూతన పాలకవర్గం ఏర్పడి మూడు నెలల కాలం పూర్తయిందని పేర్కొంటూ, పట్టణ ప్రజలకు తాము అనునిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ ముందస్తు పనుల ప్రారంభ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కుతడి తిరుపతి, పాతకాల అనిల్, బొళ్ళ సదానందం , మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

