భద్రకాళీ అమ్మవారి ఆలయంలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ: హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు
వరంగల్/హనుమకొండ,వి90 న్యూస్,జూన్ 17: హనుమకొండలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రకాళీ అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తన దంపతులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు వారి అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా, శోభాయమానంగా అలంకరించారు.

ఈ మహోత్సవాన్ని కళ్లారా తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో భద్రకాళీ ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి, ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులంతా లైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ దివ్యమైన వేడుకలో ఆలయ ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు , పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

