తీవ్ర విషాదం: పవన్ కళ్యాణ్ పరామర్శించిన హనుమకొండ యువకుడు నిరంజన్ కన్నుమూత
హనుమకొండ,వి90 న్యూస్,జూలై 08: హనుమకొండ హనుమాన్ నగర్ పరిధిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. గత కొంతకాలంగా ప్రాణాంతక అనారోగ్య సమస్యతో పోరాడుతున్న 17 ఏళ్ల యువకుడు నిరంజన్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఇటీవల జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా హనుమకొండకు వచ్చి నిరంజన్ నివాసానికి వెళ్లడం గమనార్హం. ఆ సమయంలో నిరంజన్ బెడ్పై ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ అతనిని ఆప్యాయంగా పరామర్శించి, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో కూడా మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని ధైర్యం చెప్పారు.పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర నాయకుడు స్వయంగా వచ్చి పరామర్శించడంతో నిరంజన్ కోలుకుంటాడని కుటుంబ సభ్యులు, స్థానికులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరంజన్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. వైద్యులు శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, పరిస్థితి పూర్తిగా విషమించడంతో నిరంజన్ కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ వెల్లడించారు. నూరేళ్ల జీవితం ఉండాల్సిన 17 ఏళ్ల యువకుడు ఇలా చిన్న వయసులోనే మృత్యువాత పడటం, అది కూడా డిప్యూటీ సీఎం పరామర్శించిన కొద్ది రోజులకే ఈ ఘోరం జరగడంతో హనుమాన్ నగర్ కాలనీలో తీవ్ర శోకం వ్యక్తమవుతోంది. నిరంజన్ మృతి పట్ల జనసేన శ్రేణులు, స్థానిక ప్రజలు నివాళులర్పిస్తూ, ఆ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.

