వరంగల్లో ఘనంగా ముగిసిన భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్: విజేతలకు పతకాలు అందజేసిన సీపీ ఎన్. శ్వేత
వరంగల్,వి90 న్యూస్,జూలై 09: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మామూనూరు పోలీస్ శిక్షణ కేంద్రంలో గత మూడు రోజులుగా ఉత్సాహభరితంగా సాగిన భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ గురువారం ఘనంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత (ఐపీఎస్) పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి చేతులమీదుగా పతకాలను అందజేసి అభినందించారు.ఈ జోనల్ స్థాయి డ్యూటీ మీట్లో వరంగల్, ఖమ్మం కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు హోరాహోరీగా తలపడ్డారు. ముఖ్యంగా కంప్యూటర్ పరిజ్ఞానం, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్ లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రాఫీ వంటి కీలక విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో అధికారులు తమ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించారు.ఈ పోటీల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగం 13 గోల్డ్ మెడల్స్తో సహా మొత్తం 28 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలవగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 12, మహబూబాబాద్ జిల్లా 13, ఖమ్మం జిల్లా 9 పతకాలను కైవసం చేసుకున్నాయి. ఇక్కడ ప్రతిభ చాటిన విజేతలు త్వరలోనే మల్కాజిగిరి కమిషనరేట్ వేదికగా జరగనున్న రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొననున్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ఇలాంటి డ్యూటీ మీట్లు పోలీసుల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. కఠోర సాధన ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలు సాధించడమే కాకుండా, విధి నిర్వహణలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను సులభంగా అధిగమించవచ్చని ఆమె సూచించారు. జోనల్ స్థాయిలో చూపిన ప్రతిభను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ పునరావృతం చేసి విభాగానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించినందుకు తోడ్పడిన అదనపు డీసీపీలు శ్రీనివాస్, బాలస్వామి, ఏసీపీలు, డీఎస్పీలు, ఆర్ఐలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ సిబ్బందిని సీపీ అభినందించారు. ఈ ముగింపు కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

