మడిపల్లిలో మహిళా సంఘ భవన నిర్మాణానికి ఘనంగా భూమి పూజ
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 09: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో గురువారం మహిళా సంఘ భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ పసుల తిరుమల ఘనంగా భూమి పూజ చేశారు. ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద మంజూరైన 10 లక్షల రూపాయల నిధులతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామీణ మహిళల సంక్షేమం మరియు వారి అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే మహిళా సంఘాలు తమ రెగ్యులర్ సమావేశాలను, ఇతర సామాజిక కార్యక్రమాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే చోట నిర్వహించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంజిరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనాథ్, వార్డు సభ్యులు సాయిరాం, రాణి, కమ్యూనిటీ అసిస్టెంట్లు (సీఏలు) పరమేశ్వరి, స్వప్నలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

