ప్రజలకు గమనిక: రేపటి నుండి మూడు నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 09: ఎల్ఎండీ (LMD) ఇన్టేక్ వెల్లో వరంగల్కు సంబంధించిన మోటార్ల అత్యవసర మరమ్మత్తు పనుల కారణంగా హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాకు తాత్కాలికంగా అంతరాయం కలగనుంది. ఆయా నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలలో ఈ నెల 10వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం 1:00 గంటల నుండి 11వ తేదీ (శనివారం) సాయంత్రం 7:00 గంటల వరకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు తమకు అవసరమైన మేర తాగునీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే నీటి సరఫరా పునరుద్ధరించే వరకు తాత్కాలికంగా గ్రామ పంచాయతీ లేదా స్థానిక ప్రత్యామ్నాయ నీటి వనరులను వినియోగించుకుంటూ సహకరించాలని అధికారులు ఒక ప్రకటనలో కోరారు.

