ఈశ్వరమ్మ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జక్కిడి శివచరణ్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి: దొంతరవేన రమేష్ యాదవ్ డిమాండ్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 14: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమితులైన బీసీ మహిళ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ పై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను జమ్మికుంట మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దొంతరవేన రమేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. సమాజంలో వెనుకబడిన వర్గానికి చెందిన ఒక మహిళా నాయకురాలిని అవమానించేలా మాట్లాడటం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శివచరణ్ రెడ్డి తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని, ఈశ్వరమ్మ యాదవ్తో పాటు యాదవ జాతికి, బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలనైనా, వ్యాఖ్యలనైనా తాము ఎంతమాత్రం సహించబోమని రమేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఒకవేళ శివచరణ్ రెడ్డి క్షమాపణ చెప్పని పక్షంలో బీసీ సంఘాలన్నింటినీ ఏకం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా నిరసనలో భాగంగా అవసరమైతే జక్కిడి శివచరణ్ రెడ్డి నివాసాన్ని కూడా ముట్టడిస్తామని తేల్చిచెప్పారు. రానున్న రోజుల్లో బీసీ సమాజం ఐక్యంగా ఉండి ఇటువంటి శక్తులకు తగిన సమాధానం చెబుతుందని ఆయన పేర్కొన్నారు.

