జమ్మికుంటలో తీవ్ర విషాదం… ఆర్థిక ఇబ్బందులతో కేబుల్ ఆపరేటర్ ఆత్మహత్య..
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 15: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన స్థానిక కేబుల్ ఆపరేటర్ దాసరి రామ్మూర్తి గౌడ్ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. నిత్యం స్థానిక ప్రజలతో ఎంతో చురుగ్గా, ఉల్లాసంగా ఉంటూ అందరితో ఆప్యాయంగా మాట్లాడే రామ్మూర్తి ఉన్నట్టుండి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన అకాల మరణంతో భార్య సుజాత, ఇద్దరు కుమార్తెలు గుండెలవిసేలా రోదిస్తూ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

కన్నతండ్రి మరణాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయిన చిన్న కుమార్తె సాయి ప్రీతి.. ఎంతో గుండె నిబ్బరంతో వ్యవహరించి తన తండ్రి చితికి నిప్పంటించి అంత్యక్రియలు నిర్వహించింది. సమాజ కట్టుబాట్లను పక్కనబెట్టి కూతురే కొడుకై తండ్రికి చివరి వీడ్కోలు పలికిన ఈ హృదయవిదారక దృశ్యం అక్కడున్న బంధువులు, గ్రామస్థులు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఈ సంఘటనను చూసిన వారంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రామ్మూర్తి భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా కొలనురు గ్రామానికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్థుల సమక్షంలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఒక నిండు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి దూరమవడంతో అటు జమ్మికుంట పట్టణంలోనూ, ఇటు కొలనూరు గ్రామంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

