రోడ్లపై తిరిగే గోవులను గోశాలకు తరలిస్తాం: కౌన్సిలర్ ఒగ్గు రమేష్ హెచ్చరిక
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 15: జమ్మికుంట మున్సిపల్ పరిధిలో రోడ్లపై గోవులను విచ్చలవిడిగా వదిలేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 28వ వార్డు కౌన్సిలర్ ఒగ్గు రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి తన వార్డు పరిధిలో ఒక ఆవు రోడ్డుపై ప్రసవ వేదనతో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన స్థానికులు తనకు సమాచారం అందించారని ఆయన తెలిపారు. స్పందించిన కౌన్సిలర్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, మున్సిపల్ సిబ్బందితో పాటు పశువైద్య అధికారిని రప్పించి ఆవుకు సురక్షితంగా ప్రసవం జరిగేలా దగ్గరుండి చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఒగ్గు రమేష్ మాట్లాడుతూ, గోవుల యజమానులు తమ పశువులను బాధ్యతాయుతంగా సంరక్షించుకోవాలని, రోడ్లపైకి వదిలేయవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై విచ్చలవిడిగా వదిలేస్తే ఆ గోవులను గోశాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. ప్రజల భద్రతతో పాటు పశువుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగి శ్రీకాంత్తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

