మానేరు ఇసుకను స్థానిక ప్రజలకే అందించాలి… తహశీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నిరసన
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 15: జమ్మికుంట మానేరు ఇసుకను స్థానిక ప్రజలకే అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డిప్యూటీ తహశీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ, మానేరు ఇసుకను స్థానిక జమ్మికుంట పరిసర ప్రాంతాల ప్రజలకు తక్కువ ధరకు, సులభంగా అందించాలని డిమాండ్ చేస్తూ గత పది రోజుల క్రితం గాంధీ చౌరస్తాలో ఒక రోజు నిరసన దీక్ష చేపట్టినప్పటికీ ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యే కానీ, అధికారులు కానీ స్పందించకపోవడం దారుణమన్నారు.తనుగుల, విలాసాగర్ ప్రాంతాల్లో లభించే ఇసుకను ఇతర జిల్లాలకు తరలిస్తూ అక్రమంగా డబ్బులు దండుకుంటున్నారని, అదే సమయంలో జమ్మికుంట ప్రజలకు మాత్రం ఇసుక దొరకకుండా చేసి బ్లాక్లో ఎనిమిది వేల రూపాయల వరకు అధిక ధరకు విక్రయిస్తూ ప్రజలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే, అధికారులు స్పందించి వారంలోగా స్థానిక ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, లేనిపక్షంలో ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కైలాసకొటి గణేష్, నాయకులు కొరె రవిందర్, అప్పం మధు, గుర్రం పరుశురాం, అడువాల శ్రీధర్, కేస స్వరూప, ఆకుల తిరుపతి, పోచయ్య, తుర్పాటి శంకర్, ఉడుగుల మహేందర్, సమ్మిరెడ్డి, బొజ్జ శరత్ తదితరులు పాల్గొన్నారు.

