ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 16: ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (SIR) కార్యక్రమాన్ని ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం పిలుపునిచ్చారు.జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా రూపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వారు కూడా తమ వివరాలను ఒకసారి సరిచూసుకోవాలని సూచించారు.బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తున్నప్పుడు ప్రజలు వారికి పూర్తి సహకారం అందించాలని, అవసరమైన పత్రాలను సమర్పించి ఓటరు జాబితాను ఖచ్చితంగా రూపొందించేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని అన్నారు.ఎన్నికల సంఘం ఈ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఆగస్టు 3 వరకు పొడిగించిందని చైర్పర్సన్ తెలిపారు. కాబట్టి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పరిధిలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల ప్రజలందరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని పుల్లూరి స్వప్న సదానందం కోరారు.

