కోనసీమ తిరుమల వాడపల్లిని టెంపుల్ టౌన్గా అభివృద్ధి చేయాలి
ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విజ్ఞప్తి
కొత్తపేట,వి90 న్యూస్,జూలై 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అమరావతి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోనసీమ తిరుమల వాడపల్లిని పూర్తిస్థాయిలో టెంపుల్ టౌన్గా అభివృద్ధి చేయాలని కోరుతూ, దానికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను సీఎంకు అందజేశారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ‘శ్రీనివాసం-2’ వసతి గృహ నిర్మాణానికి టీటీడీ నిధులు మంజూరు చేయించాలని, అలాగే కొత్తపేట రెవిన్యూ డివిజనల్ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. నియోజకవర్గంలోని ఇతర మౌలిక వసతుల కల్పనకు నిధులు విడుదల చేయాలని చేసిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ ప్రతిపాదిత పనులు పూర్తయితే కొత్తపేట నియోజకవర్గం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఎంతో వృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

