ఓట్ల సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 17: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కో-ఆర్డినేటర్ల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొని, క్షేత్రస్థాయిలో ఓట్ల సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రతీ బూత్ పరిధిలో ఓటరు నమోదు, సవరణ ప్రక్రియ చాలా కీలకమైనదని, ఇందులో ప్రతి ఓటరు ప్రాముఖ్యతను గుర్తించి బూత్ లెవెల్ ఏజెంట్లతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆయన కోరారు.క్రింది స్థాయిలో జరుగుతున్న ఓట్ల సవరణ ప్రక్రియను రాష్ట్ర పీసీసీ నిశితంగా పరిశీలిస్తోందని, ఎన్నికల కమిషన్ పొడిగించిన సమయాన్ని కో-ఆర్డినేటర్లు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

క్షేత్రస్థాయిలో ఓటర్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్పందించి, వాటిని నియోజకవర్గ స్థాయి ఇంచార్జ్ లతో పాటు బీఎల్ఓలు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఓట్ల సవరణ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేలా ప్రతి కార్యకర్త, బీఎల్ఏ, కో-ఆర్డినేటర్లు కష్టపడి పనిచేయాలని ప్రణవ్ పిలుపునిచ్చారు.ఈ ముఖ్య సమావేశంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గండ్ర సుహాసిని, కౌన్సిలర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ సదయ్యతో పాటు అన్ని మండలాల, పట్టణ అధ్యక్షులు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, కో-ఆర్డినేటర్లు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

