విద్యార్థులపై లాఠీఛార్జ్ అమానుషం: నీట్ను రద్దు చేసి, విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలని సీపీఎం డిమాండ్
కరీంనగర్/జమ్మికుంట, వి90 న్యూస్ జూలై 21: ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని నిరసిస్తూ జమ్మికుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థులు, యువత పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీ కుంభకోణం వల్ల 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా స్పందించని కేంద్ర ప్రభుత్వం, ప్రశ్నించే విద్యార్థులపై దమనకాండకు పాల్పడటం అత్యంత క్రూరమైన చర్య అని విమర్శించారు. పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే భర్తరఫ్ చేయాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఎన్టీఏ (NTA) ను రద్దు చేసి నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల ప్రజాస్వామ్యయుత ఉద్యమాన్ని అణచివేసేందుకు రైళ్లను రద్దు చేసి, ఢిల్లీని పోలీసు శిబిరంగా మార్చినా వేలాది మంది విద్యార్థులు పార్లమెంట్ స్ట్రీట్కు చేరుకుని తమ నిరసనను విజయవంతం చేశారని తెలిపారు. లాఠీలు, అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని, కేంద్ర ప్రభుత్వం ఫాసిస్ట్ ధోరణి వీడి విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, విద్యార్థి లోకానికి సీపీఎం పూర్తి సంఘీభావం తెలుపుతుందని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి జక్కుల రమేష్ యాదవ్, మండల కమిటీ సభ్యులు దండిగారి సతీష్, గడ్డం శోభన్, మారేపల్లి కిరణ్, సిరికొండ పోచయ్య, వేషాల రమేష్, పుల్ల కరుణాకర్, నిమ్మల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

