హనుమకొండలోని అశోక జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: పోటాపోటీ ఆందోళనలతో హోరెత్తిన వాతావరణం
హన్మకొండ,వి90 న్యూస్,జూలై 22: హనుమకొండలోని ప్రధాన కేంద్రమైన అశోక జంక్షన్ వద్ద ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని కాంగ్రెస్ నాయకులు దహనం చేయడాన్ని నిరసిస్తూ బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా బిజెపి నాయకులు నినాదాలు చేస్తూ, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్న బిజెపి నాయకులను, కార్యకర్తలను పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూసేందుకు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో పోలీసులకు, బిజెపి శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనతో అశోక జంక్షన్ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

