అమృత న్యూరో హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ మెదడు దినోత్సవం: నాడీ సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 22: ప్రపంచ మెదడు దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంటలోని అమృత న్యూరో హాస్పిటల్లో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది ప్రపంచ న్యూరాలజీ సమాఖ్య (WFN) ప్రకటించిన “Brain Health: Access for All” (మెదడు ఆరోగ్యం – అందరికీ అందుబాటులో) అనే ప్రధాన థీమ్తో ఈ సదస్సు సాగింది. ఈ సందర్భంగా ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ భరత్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.4 బిలియన్ మంది ఏదో ఒక నాడీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్ట్రోక్, మూర్ఛ వ్యాధి (ఎపిలెప్సీ), మైగ్రేన్ వంటి నాడీ సంబంధిత సమస్యలను ప్రారంభంలోనే గుర్తించి సకాలంలో తగిన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పడంతో పాటు శాశ్వత వైకల్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు.ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, రక్తపోటు, మధుమేహం లాంటి సంక్లిష్టతలను నిరంతరం నియంత్రణలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ధూమపానం, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చని వివరించారు. మెదడు ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరి హక్కు అని, ఈ సేవలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అందుబాటులోకి వచ్చేలా చైతన్యం తీసుకురావడం మనందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమృత న్యూరో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎలుక దేవేందర్ రెడ్డితో పాటు ఆసుపత్రి టెక్నీషియన్లు, పీఆర్వోలు, నర్సింగ్ , రిసెప్షన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

