సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు: జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 22: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపారులు సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) అధ్యక్షతన పాత మున్సిపల్ కార్యాలయంలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు, బజ్జీలు , తోపుడు బండ్ల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు , కవర్లలో ఆహార పదార్థాలు అందించకూడదని, వాటికి బదులుగా ఆకులు లేదా పర్యావరణహిత పాత్రలనే వాడాలని సూచించారు. టీ స్టాళ్లలో గాజు లేదా స్టీల్ గ్లాసులను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు.

నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను వాడితే రూ. 1,000 నుండి రూ. 2,000 వరకు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే బజ్జీ బండ్ల నిర్వాహకులు మెయిన్ రోడ్డుపై ఉన్న వైట్ లైన్ దాటకుండా, కేటాయించిన ప్రదేశాల్లోనే వ్యాపారం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. దుకాణాల ఎదురుగా వ్యాపారం చేసుకునే బండ్ల నిర్వాహకులు ఎవరికీ ఎలాంటి కిరాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని యజమానులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఐ. రమేష్, మున్సిపల్ జవాన్లు , పట్టణ వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

