రాహుల్ గాంధీ అరెస్టుపై కదంతొక్కిన కాంగ్రెస్ శ్రేణులు: కరీంనగర్లో భారీ ర్యాలీ
కరీంనగర్,వి90 న్యూస్,జూలై 22: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేపర్ లీకులు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడం, వారికి మద్దతుగా నిలిచిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీనగర్ కార్ఖానా గడ్డ గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, గ్రంథాలయ ఛైర్మన్ సత్తు మల్లేశం, సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర అధ్యక్షుడు అంజన్ కుమార్, కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ యువతే దేశానికి ప్రధాన బలమని చెప్పే ప్రధాని మోదీ, ఆ యువతపైనే దాడులు చేయించడం అత్యంత శోచనీయమని విమర్శించారు.

బాధితుల తరఫున పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారంపై పార్లమెంట్లో భేషరతుగా చర్చ జరగాలని, ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఈ అంశంపై పార్లమెంట్లో నోరు విప్పాలని కోరారు. అనంతరం గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

