జమ్మికుంటలో తొలి ఏకాదశి వేడుకలు: బీరన్న స్వామికి కౌన్సిలర్ ఒగ్గు రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 22: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక బీరన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు , మొక్కుల కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు, కురుమ సంఘ ప్రతినిధులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్, పట్టణ కురుమ సంఘ అధ్యక్షుడు ఒగ్గు రమేష్ మాట్లాడుతూ హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో విశిష్టమైన స్థానం ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, రైతాంగంతో పాటు ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని బీరన్న దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. సమాజంలో ఐక్యత, సామరస్యం పెంపొంది ప్రతి కుటుంబం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.ప్రతి ఏటా తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ తమ ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటున్నామని, యువత కూడా ఇదే బాటలో నడుస్తూ సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఒగ్గు రమేష్ పిలుపునిచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ జిల్లా వైస్ చైర్మన్ పింగళి రమేష్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్, సీనియర్ నాయకుడు సాయిని రవి, పలువురు కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ సభ్యులు, కురుమ సంఘ కుల పెద్దలు, మహిళలు , యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.

