కరీంనగర్ భగత్ నగర్ చోరీ కేసులో వేగవంతమైన పురోగతి.. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 22: కరీంనగర్ పట్టణ పరిధిలోని భగత్ నగర్లో గత రాత్రి జరిగిన సంచలనాత్మక భారీ చోరీ కేసులో పోలీసులు అత్యంత వేగంగా విచారణ చేపట్టి ముమ్మర పురోగతి సాధించారు. స్థానిక భగత్ నగర్లోని ఓ ఇంట్లో ఎవరు లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని లోపలికి చొరబడిన గుర్తుతెలియని దుండగులు ఏకంగా 60 తులాల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 21 లక్షల నగదుతో పాటు ఇంట్లోనే ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను కూడా ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో సాంకేతిక , భౌతిక ఆధారాలను క్షుణ్ణంగా సేకరించారు.బాధితుల ఇల్లు గుల్ల చేసి దొంగిలించిన రెండు ద్విచక్ర వాహనాలపై దుండగులు పరారైనట్లు గుర్తించిన పోలీసులు వెంటనే చుట్టుపక్కల ప్రాంతాలను, సిసిటీవి కెమెరాలను జల్లెడ పట్టారు.

ఈ క్రమంలోనే దొంగలు పోలీసుల కంటపడకుండా తప్పించుకునే క్రమంలో హుజూరాబాద్ మండలం పాపయ్యపల్లి వద్ద ఉన్న ఎస్సారెస్పీ (SRSP) కెనాల్ సమీపంలోని చెట్ల పొదల్లో రెండు బైకులను వదిలివేసి పరారైనట్లు పోలీసులు కనుగొన్నారు. నిందితులు వాహనాలను కెనాల్ వద్దే పడేసి వెళ్లడంతో వారు ఏ మార్గంలో తప్పించుకుని ఉంటారనే కోణంలో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ దొంగతనానికి పాల్పడింది పాత నేరస్థులా లేక ఇతర ప్రాంతాల నుండి వచ్చిన గ్యాంగ్ ఆ అనే కోణంలో అనుమానితులను విచారిస్తూ దొంగలను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

