జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 27న ‘ఛలో పార్లమెంట్’: టీడబ్ల్యూజేఎఫ్
కరీంనగర్,వి90 న్యూస్,జూలై 23: కేంద్ర ప్రభుత్వం వద్ద దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న “ఛలో పార్లమెంట్” కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు తెలిపారు. కరీంనగర్లోని ఫెడరేషన్ కార్యాలయంలో గురువారం “ఛలో పార్లమెంట్” పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి, ఎంపీల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్లు చెప్పారు. కోవిడ్ సమయంలో నిలిపివేసిన 50 శాతం రైల్వే రాయితీ పాసులను వెంటనే పునరుద్ధరించాలని, అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో ‘నేషనల్ మీడియా కమిషన్’ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వయోవృద్ధులైన, రిటైర్డ్ జర్నలిస్టులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన “జాతీయ పెన్షన్ పథకం” అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులు, అక్రమ కేసులను అరికట్టేందుకు పార్లమెంట్లో ప్రత్యేకంగా “జర్నలిస్టుల రక్షణ చట్టం” తీసుకురావాలని, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలకు పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించాలని కోరారు. వీటితో పాటు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలకు భూముల కేటాయింపుపై ఉన్న సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించి, అర్హులైన పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ డిమాండ్ల సాధనకై ఈ నెల 27న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక రోజు నిరసన ధర్నా నిర్వహిస్తున్నామని, అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలను కలసి వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. ఈ ధర్నాలో కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన టీడబ్ల్యూజేఎఫ్, ఐఎఫ్ డబ్ల్యూజే (IFWJ) నాయకులు, జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు గాదె కరుణాకర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు లక్కం సురేష్, కొమ్ము గణేష్, సహాయ కార్యదర్శులు అతికం రాజశేఖర్, గుండి కిరణ్ , ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

