గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యాజెండా: వొడితల ప్రణవ్
కరీంనగర్/వీణవంక,వి90 న్యూస్,జూలై 23: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ మహిళల సంక్షేమం చుట్టే అమలవుతున్నాయని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. గురువారం రోజున వీణవంక మండల పరిధిలోని బొంతుపల్లి గ్రామంలో జమ్మికుంట నుండి గద్ధపాక వరకు నడిచే నూతన బస్ సర్వీసును ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనకు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.అనంతరం వొడితల ప్రణవ్ మహిళలతో కలిసి టికెట్ తీసుకుని బస్సులో ప్రయాణించారు. ప్రయాణ సమయంలో మహాలక్ష్మి పథకం, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయా అని మహిళలను అడిగి తెలుసుకోగా, తమకు క్రమం తప్పకుండా పథకాలు అందుతున్నాయని, ఈ సౌకర్యాలపై వారు హర్షం వ్యక్తం చేశారు.అంతకుముందు, బొంతుపల్లి గ్రామంలో 8 లక్షల రూపాయల ఎస్డిఎఫ్ నిధులతో నూతనంగా నిర్మించిన కల్వర్టును ఆయన ప్రారంభించారు.

ఈ కల్వర్టు నిర్మాణం వల్ల సుమారు 60 ఎకరాలకు పైగా పొలాలకు సాగునీరు, రవాణా సదుపాయం మెరుగుపడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తమ సమస్యను ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించినందుకు గ్రామస్థులు, రైతులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, ఈ బస్సు సౌకర్యాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ బస్ సర్వీసు మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

