హనుమకొండలో ఉద్రిక్తం: విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ‘చలో కలెక్టరేట్’
హన్మకొండ,వి90 న్యూస్,జూలై 23: హనుమకొండ జిల్లాలో విద్యార్థుల సమస్యలపై పోరాటం మరింత వేడెక్కింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ (AISF) ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
మంగళవారం జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు, నాయకులు కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం హోరెత్తింది. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని, స్కాలర్షిప్లు అందక పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి దాపురించిందని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిపడ్డ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే ఖాతాల్లో జమ చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

