జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ నేతృత్వంలో ఎస్ఐఆర్ సమీక్ష: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 23: జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ (RDO) ఆధ్వర్యంలో సమగ్ర ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (SIR) ప్రక్రియపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, తహసీల్దార్లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇంకా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అర్హుడైన ఓటరుకు అవకాశం కల్పించేలా స్థానిక కౌన్సిలర్లు, బీఎల్ఓలు పరస్పర సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మాట్లాడుతూ,

మున్సిపల్ కమిషనర్ సమన్వయంతో జమ్మికుంట పట్టణ పరిధిలోని 30 వార్డుల కౌన్సిలర్లు, బీఎల్ఓలతో కలిసి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఓటరును గుర్తిస్తామని తెలిపారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను వంద శాతం విజయవంతం చేసేందుకు శ్రమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల కౌన్సిలర్లు, బీఎల్ఓలు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

