ఓటు సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ దృష్టి.. హుజరాబాద్లో బిఎల్ఏలతో విస్తృత స్థాయి సమావేశం
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 24: రాష్ట్రంలో సమగ్ర ఓటు సవరణ నమోదు ప్రక్రియ (సర్) సమయం దగ్గర పడుతుండటంతో హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఈ ప్రక్రియలో బిఎల్ఏల పనితీరు, తలెత్తుతున్న సందేహాలను నివృత్తి చేసేందుకు సుడా మాజీ ఛైర్మెన్, హుజురాబాద్ ‘సర్’ ఇంచార్జి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కమలాపూర్, వీణవంక మండల పరిధిలోని గ్రామాల బిఎల్ఏలు, కో-ఆర్డినేటర్లతో ఈ ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామాల వారీగా ఓటు నమోదు ప్రక్రియపై సమీక్షించారు.

ఇప్పటివరకు బిఎల్ఏల వద్ద ఉన్న పూర్తి సమాచారం కో-ఆర్డినేటర్ల సమన్వయంలో ఉందో లేదో అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఓటు నమోదు ఫారాలు అందుబాటులో లేకపోతే బిఎల్ఏలు వెంటనే కో-ఆర్డినేటర్ల దృష్టికి తీసుకెళ్లాలని, వారి ద్వారా సమాచారం అందితే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సమాచారాన్ని అందించారని, ఓటు నమోదు ప్రక్రియపై పార్టీ పూర్తి ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. పొరపాట్లకు తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యేలా చూస్తూ, ఏ ఒక్క ఓటూ వృథా కాకుండా కార్యకర్తలు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్, వీణవంక మండలాల నాయకులు, గ్రామస్థాయి ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

