తాత ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత సేవ చేస్తా: వొడితల ప్రణవ్
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 24: మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత వొడితల రాజేశ్వర్ రావు చూపిన బాటలోనే నడుస్తూ ప్రజలకు మరింత సేవ చేస్తానని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. శుక్రవారం వొడితల రాజేశ్వర్ రావు వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకులతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలసి రాజేశ్వర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాజకీయాల్లో క్లిష్ట సమయాల్లో ఆనాటి భారత ప్రధాని పీవీ నరసింహారావుకు చేదోడువాదోడుగా నిలిచి ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో రాజేశ్వర్ రావు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

నిరుపేద విద్యార్థులకు విద్య దూరం కాకూడదనే లక్ష్యంతో విద్యాసంస్థలు నెలకొల్పి ఉచిత విద్యను అందించారని, రాజ్యసభ సభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన అందించిన సేవలు, వేసిన అభివృద్ధి ఆనవాళ్లు ఇప్పటికీ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, వైస్ చైర్మన్ అంజలి, స్థానిక కౌన్సిలర్లు, దేవాలయాల, మార్కెట్ కమిటీల బాధ్యులు, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

