సోషల్ మీడియా తొందరపాటు: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు.. మరణ వార్తపై తప్పుడు ప్రచారం
హన్మకొండ,వి90 న్యూస్,జూలై 26: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఉదయం గుండెపోటుకు గురికావడంతో ఆయనను వెంటనే హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. అయితే వైద్యుల నుంచి ఎటువంటి అధికారిక సమాచారం రాకముందే ఆయన మరణించారంటూ సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో పెద్దఎత్తున రూమర్లు వ్యాపించాయి. ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ స్టేటస్లలో సంతాప సందేశాలు పోస్ట్ చేశారు.కొద్దిసేపటికే స్పందించిన రోహిణి ఆసుపత్రి వైద్యులు మీడియా ముందుకు వచ్చి, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయనకు నిరంతరం చికిత్స కొనసాగుతోందని స్పష్టం చేశారు. వైద్యుల ప్రకటనతో వాస్తవం తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు వెంటనే తమ తప్పుడు పోస్టులు, వాట్సాప్ స్టేటస్లను తొలగించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరామర్శించి తెలుసుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ నుంచి వరంగల్కు బయలుదేరి వెళ్లారు. అధికారిక నిర్ధారణ లేకుండా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ప్రచారం చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసిందని, ప్రజలు, కార్యకర్తలు కేవలం బాధ్యతాయుతమైన, ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలని వైద్యులు, పార్టీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి.

