తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు, ఐడెంటిటీ కార్డులు, సంక్షేమ పథకాలు అమలు చేయాలి: ఎక్కటి సంజీవరెడ్డి
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 27: జమ్మికుంట పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ (TUF) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్, జిల్లా అధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు డా. చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం ఏర్పాటైన కే.కే. కమిటీ ఈ నెల 8 నుంచి 22 వరకు వివిధ జిల్లాల ఉద్యమకారులు, విద్యార్థి, ప్రజా, కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులతో విస్తృత భేటీలు నిర్వహించిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నెల 20న కే.కే. కమిటీకి ఫోరమ్ తరఫున పలు కీలక డిమాండ్లను సమర్పించినట్లు చెప్పారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన వారిని అధికారికంగా గుర్తించి ఐడెంటిటీ కార్డులు, హెల్త్ కార్డులు, 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని కోరారు. జార్ఖండ్ రాష్ట్రం తరహాలోనే ఇక్కడ కూడా ఉద్యమకారుల సంక్షేమ విధానాన్ని అమలు చేయాలని, ప్రాణత్యాగాలు చేసిన, జైలు శిక్షలు అనుభవించిన ఉద్యమకారులకు తగిన గౌరవం కల్పించేలా ముఖ్యమంత్రి కే.కే. కమిటీకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నేరుగా వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఆరే రమేష్ రెడ్డి, రచ్చ గణేష్, పతకాల ఓదెలు, కొంగరి రవీందర్, బిట్ల రమేష్, మంకాలి రమ తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.

