నీట్ పేపర్ లీక్ బాధితులకు న్యాయం చేయాలి: హనుమకొండలో సీపీఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన
హన్మకొండ,వి90 న్యూస్,జూలై 27: హనుమకొండ జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీ ఉదంతంలో మరణించిన విద్యార్థులకు సంతాపం తెలుపుతూ కొవ్వొత్తుల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నీట్ అక్రమాల వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే రద్దు చేయాలని, వారిపై లాఠీచార్జ్ చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ‘ఒకే దేశం, ఒకే విధానం’ పేరుతో అధికారాలన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారని విమర్శించారు. నీట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, ఆయా రాష్ట్రాలే స్వయంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేశారు. నీట్ వ్యవహారంతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నందుకు ప్రధాని మోదీ దేశ ప్రజలకు, యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

