రేవంత్ రెడ్డి, కేటీఆర్లకు నిరుద్యోగ అవార్డులు ఇవ్వాలి: ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్
న్యూఢిల్లీ,వి90 న్యూస్,జూలై 28: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణను దోచుకున్న ఆ ఇద్దరు నాయకులూ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలు రెండూ కూడా తెలంగాణ విద్యార్థుల, యువత భవిష్యత్తును నాశనం చేయడంలో పోటీపడి విజయవంతమయ్యాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడం వల్ల ప్రతి ఏటా దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల చదువు అనిశ్చితిలో పడిందని, ఆర్థిక భారం తట్టుకోలేక వందలాది కళాశాలలు మూసివేత దశకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీవ్రంగా నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి భారీ ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడి కేసీఆర్ కుటుంబం అపారమైన సంపదను కూడబెట్టిందని, ఆ అప్పుల భారాన్ని ప్రజలపై మోపారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం విద్యార్థులు, యువత (జెన్ జీ) కోసం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ మొసలి కన్నీళ్లు కార్చుతున్నారని ఎద్దేవా చేశారు.దేశంలోనే అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణను ఒకటిగా నిలిపారని, గత 13 ఏళ్లుగా జాబ్ క్యాలెండర్ను నిలిపివేసినందుకు గాను రేవంత్ రెడ్డి, కేటీఆర్లకు అవార్డులు ఇవ్వాలంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రానికి ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ, స్వచ్ఛమైన పాలన అందించే ప్రభుత్వం అత్యవసరమని, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు స్పష్టంగా మొగ్గు చూపుతున్నారని ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు.

