కొండగట్టు అంజన్న క్షేత్రంలో ఘనంగా గిరిప్రదక్షిణ | వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాల్గొన్న భక్తులు, కాంగ్రెస్ శ్రేణులు
రాష్ట్ర, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి: వొడితల ప్రణవ్
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 29: రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతులకు ఎల్ నీనో నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తూ నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కొండగట్టు అంజన్నను వేడుకున్నారు.కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కొండగట్టులో నిర్వహించిన గిరిప్రదక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, మున్నూరు కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు బొమ్మ శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు.

గిరిప్రదక్షణ సమయంలో వర్షం పడుతున్నప్పటికీ భక్తులు, నాయకులు, కార్యకర్తలు ఏమాత్రం వెనుకాడకుండా, ఆంజనేయ స్వామి నామస్మరణతో భక్తిశ్రద్ధలతో ప్రదక్షణ పూర్తిచేశారు. వర్షం కురవడాన్ని ఆంజనేయ స్వామి అనుగ్రహంగా భావిస్తున్నామని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొండగట్టు అంజన్న అనుగ్రహం ప్రజలందరిపై, ముఖ్యంగా రైతన్నలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పాడిపంటలతో హుజూరాబాద్ నియోజకవర్గం ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో విలసిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావంపై వాతావరణ శాస్త్రవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తుంటే, BRS నాయకుడు కౌశిక్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీయే కరువు తెచ్చిందంటూ మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమని ప్రణవ్ తీవ్రంగా మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి తాను పెద్ద శాస్త్రవేత్తలా మాట్లాడటం సిగ్గుచేటని, ప్రజలను ఇబ్బంది పెట్టే పనుల్లో BRS నాయకులు ఎప్పుడూ ముందుంటారని ధ్వజమెత్తారు.హుజూరాబాద్ నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంతో ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా ముగిసింది.

