ఇల్లందకుంట పాఠశాలలో సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు
కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్,జూలై 29: ఇల్లందకుంట మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్. ధనరాజ్ గౌడ్ మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లాలో ప్రతినిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్, కారులో వెళ్లేటప్పుడు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించేలా చూడాలని సూచించారు. కుటుంబ పెద్దను కోల్పోతే ఆ కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక కష్టాలు వర్ణనాతీతమని, విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని,

సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదని స్పష్టం చేశారు. అనంతరం ఇల్లందకుంట సబ్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి రక్షణ లభిస్తుందని, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించినప్పుడే కుటుంబాలు సురక్షితంగా ఉంటాయని తెలిపారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలో నేర్చుకున్న రోడ్డు భద్రతా నియమాలను తమ ఇళ్ల వద్ద తల్లిదండ్రులకు వివరించాలని చెప్పారు.ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తస్మైన్ నస్మీన్, మండల విద్యాధికారి కె. రాములు, గ్రామ సర్పంచ్ దార సురేష్, ఉపాధ్యాయులు కె. జయ ప్రకాష్, సిహెచ్. వేణు, కే. శంకర్, ఎం. సమిరెడ్డి, కే. సత్యనారాయణ, జి. అన్నపూర్ణ, జె. రాధికా రాణి, ఏ. సురేష్, డి. ఉమాదేవి, ఎం. ఐలయ్య, సిహెచ్. రామకృష్ణ, డి. పరమేశ్వర్, వనిత, దేవేందర్, స్రవంతి, విశ్వతేజ, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

