ఇంటర్ విద్యారంగ సమస్యలపై హనుమకొండ కలెక్టరేట్ను ముట్టడించిన ఏబీఎస్ఎఫ్
హన్మకొండ,వి90 న్యూస్,ఆగస్టు 07: ఇంటర్మీడియట్ విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు భారీగా తరలివచ్చి చేపట్టిన ఈ ర్యాలీతో కలెక్టరేట్ ఆవరణ ఉద్రిక్తంగా మారింది.ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ అధ్యక్షుడు మంద నరేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని, తక్షణమే రాష్ట్రానికి ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ఫీజులు అందక నిరుపేద విద్యార్థులు చదువు మధ్యలోనే మానేస్తూ డ్రాపౌట్లుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.అదేవిధంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో సాగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నడుస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలను వెంటనే గుర్తించి వాటి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

