శాంతినికేతన్ పాఠశాలలో అంబరాన్నంటిన బోనాల పండుగ సంబరాలు
హన్మకొండ/కమలాపూర్,వి90 న్యూస్, ఆగస్టు 07: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలోని శాంతినికేతన్ పాఠశాలలో బోనాల పండుగ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు ప్రత్యేకంగా అమ్మవారి చిత్రాన్ని అలంకరించి, విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో తలపై బోనాలతో వచ్చి నృత్యాలు చేస్తూ భక్తిపారవశ్యంతో ముంచెత్తారు. విద్యార్థుల పోతరాజు విన్యాసాలు, రకరకాల వేషధారణలు అందరినీ ఆకట్టుకోవడంతో పాఠశాల ప్రాంగణమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లింగారెడ్డి మాట్లాడుతూ.. నేటి తరం విద్యార్థులకు మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు , తెలంగాణ పండుగల విశిష్టతను తెలియజెప్పే ఉద్దేశంతోనే ఈ బోనాల సంబరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

