రాష్ట్రంలో వర్షాలు కురవాలని నాగార్జునసాగర్లో ఈ నెల 10న వరుణ యాగం
పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్,వి90న్యూస్,ఆగస్టు 07: తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 10వ తేదీన నాగార్జున సాగర్లో వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితులు, సిద్ధాంతులు నిర్ణయించిన ముహూర్తం మేరకు ఈ యాగ క్రతువు జరగనుంది.నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో ఈ యాగ నిర్వహణకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్కుమార్ రెడ్డి సారథ్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేదపండితులు ఈ ప్రత్యేక యాగ ప్రక్రియలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.కృష్ణా, గోదావరి నదులతో పాటు చెరువులన్నీ నిండి జలకళ సంతరించుకోవాలని, రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలనే సత్సంకల్పంతో ఈ ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. యాగం ముగింపులో భాగంగా నిర్వహించే మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

