కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ‘జైలు భరో’: KVPS పూర్తి మద్దతు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 09: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘జైలు భరో’ కార్యక్రమానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు సంఘ జిల్లా ఉపాధ్యక్షులు వడ్లూరి కిషోర్ తెలిపారు. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రూపురేఖలను మారుస్తూ, కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాలనే నిబంధనలతో పేద ప్రజలకు పని దక్కకుండా కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు.రైతాంగానికి పంటలకు కనీస మద్దతు ధర కల్పించకుండా రైతు వ్యతిరేక చట్టాలను అమల్లోకి తెచ్చి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో యజమానులకు, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేలా నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ చేపట్టే ఈ పోరాటంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, కార్మికులు మరియు రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కిషోర్ పిలుపునిచ్చారు.

