ఇల్లంతకుంట జడ్పీ పాఠశాలలో కోలాహలంగా బోనాల పండుగ వేడుకలు
కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్,ఆగస్టు 09: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సాంప్రదాయ సంస్కృతులకు ప్రతీకయైన బోనాల పండుగను విద్యార్థులు, ఉపాధ్యాయులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి, నిష్టతో బోనాలను సిద్ధం చేసి నెత్తిన ఎత్తుకుని ఊరేగింపుగా ఊరేగారు.

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు సీహెచ్. వేణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలకు పూర్వవైభవం వచ్చిందని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ, పట్టణాల్లోనూ బోనాల పండుగను విశేషంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. నేటి తరం విద్యార్థులకు తెలంగాణ ప్రాచీన పండుగల విశిష్టతను, సాంస్కృతిక ప్రాశస్త్యాన్ని తెలియజేసే ఉద్దేశంతోనే పాఠశాలలో ఈ వేడుకలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని విద్యార్థినులు చేతులకు గోరింటాకు అలంకరించుకుని మెహందీ వేడుకను కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారని తెలిపారు.ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు కే. జయప్రకాష్, ఎం. సమ్మిరెడ్డి, సీహెచ్. కౌసల్య, జి. అన్నపూర్ణ, కే. సత్యం, ఏ. సురేష్, సీహెచ్. రామకృష్ణ, కే. శంకర్, జె. రాధిక రాణి, ఎం. సుధాకర్, డి. ఉమాదేవి, ఎం. స్రవంతి, యు. లక్ష్మణ చారి, ఆర్. దేవేందర్, డి. పరమేశ్వర్, వనిత, విశ్వతేజలతో పాటు పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

