కమలాపూర్ లో ఫలించిన వొడితల ప్రణవ్ కృషి: అట్టహాసంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ
హన్మకొండ/కమలాపూర్,వి90 న్యూస్,ఆగస్టు 10: కమలాపూర్ మండలంలో పేద ప్రజల సొంతింటి కల ఎట్టకేలకు నెరవేరింది. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్-చార్జి వొడితల ప్రణవ్ నిరంతర కృషితో కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. గడిచిన పదేళ్లలో ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా ఉన్నవారు చేయలేని పనిని వొడితల ప్రణవ్ తన ప్రత్యేక చొరవతో, మంత్రులతో నిత్యం సంప్రదింపులు జరిపి సాధించి చూపించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ల చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కమలాపూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ జెండా గద్దెను మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు.

నియోజకవర్గానికి ఇప్పటికే 3,500 ఇళ్లను మంజూరు చేశామని, వాటి నిర్మాణాలు దాదాపు పూర్తికావచ్చాయని పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గానికి మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, ఎన్నికల హామీలకే పరిమితమైందని, చివరికి నిర్మించిన ఇళ్లను కూడా పేదలకు పంచలేకపోయిందని మంత్రులు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదింటికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కుడా మాజీ ఛైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్-చార్జి వొడితల ప్రణవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు , కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

