ఇల్లందకుంటలో బీజేపీ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ: జాతీయ జెండాలతో హోరెత్తిన వీధులు
కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్, ఆగస్టు 10: దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటిచెప్పే లక్ష్యంతో ఇల్లందకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల శాఖ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గుత్తికొండ రాంబాబు, నాయకుడు మట్ట పవన్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలను చేతబూని ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ అంటూ చేసిన దేశభక్తి నినాదాలతో ఇల్లందకుంట మండల కేంద్రంలోని ప్రధాన వీధులన్నీ మారుమోగాయి.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సమరయోధుల నిరుపమాన త్యాగాలను స్మరించుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను గర్వంగా ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని పిలుపునిచ్చారు. భారతీయులుగా దేశ ఐక్యత, అఖండత మరియు సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం మనందరి ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు. ‘హర్ ఘర్ తిరంగా’ సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరవేసేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పుల రమేష్, ఇంగ్లే ప్రభాకర్, ఏనుగు సురేందర్ రెడ్డి, తుపాకుల సతీష్, ఉప్పు దుర్గయ్య, సోమిడి సురేందర్, చింతల ఐలయ్యతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

