పద్ధతి మార్చుకోకపోతే కౌశిక్ రెడ్డికి రాళ్ళ దెబ్బలు తప్పవు: హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ హెచ్చరిక
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 11: డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ విషయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన సరిగా లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, రాళ్ళ దెబ్బలు తప్పవని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ తీవ్రంగా హెచ్చరించారు. జమ్మికుంట మండల పరిధిలోని గండ్రపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రణవ్ మాట్లాడారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని, గతంలో రెండున్నర సంవత్సరాలు ఎమ్మెల్సీగా , ప్రభుత్వ విప్ గా పనిచేసి కూడా పేదలకు ఇళ్లను ఎందుకు పంపిణీ చేయలేదో ముందుగా సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. అబద్ధాలను పదేపదే ప్రచారం చేసి నిజం చేయాలని చూస్తున్నారని, సోషల్ మీడియా వ్యామోహం తప్ప ప్రజల సంక్షేమంపై ఆయనకు ధ్యాస లేదని విమర్శించారు. 2017లోనే సగం పూర్తి చేసి వదిలేసిన ఇళ్లకు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించి ఇప్పుడు లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు చేయిస్తుంటే కౌశిక్ రెడ్డి చూసి ఓర్వలేకపోతున్నారని ప్రణవ్ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ నిత్యం కృషి చేస్తుంటే, మంత్రుల ముందే నియోజకవర్గ పరువు తీస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. రాబోయే రోజుల్లో జమ్మికుంట, హుజురాబాద్, బుజునూర్ గ్రామాల్లో కట్టిన ఇళ్లకు కూడా నిధులు తెప్పించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లతో పాటు సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

