గడపగడపకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 11: హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి గడపకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను నిరాటంకంగా అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. జమ్మికుంట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన ఆయన, లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను అందజేశారు.మండల పరిధిలోని మాచనపల్లి, పెద్దంపల్లి, జగ్గయ్యపల్లి, సైదాబాద్, కోరపల్లి, విలాసాగర్, నగురం, వావిలాల, తనుగుల, గండ్రపల్లి, శాయంపేట, మడిపల్లి సహా మొత్తం 12 గ్రామాల్లోని 34 మంది లబ్ధిదారులకు దాదాపు 11 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను ప్రణవ్ స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించి, కష్టకాలంలో అండగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ, ప్రతి ఇంటికీ నేరుగా వెళ్లి చెక్కులు ఇవ్వడం ద్వారా ప్రజల కష్టాలను దగ్గరుండి తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు. పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా తగిన సహాయం అందిస్తూ, గ్రామాల్లో ఎదురవుతున్న స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల అధ్యక్షుడు వీరమనేని పరశురామ్, స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మార్కెట్ డైరెక్టర్లు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

