కరీంనగర్లో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ: నూతన జిల్లా అధ్యక్షుడికి సత్కారం
కరీంనగర్,వి90 న్యూస్,ఆగస్టు 14: స్వాతంత్ర్య స్ఫూర్తిని, జాతీయ ఐక్యతను చాటుతూ కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు రాజేష్ ఠాకూర్, జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు కొలకాని రాజులు పాల్గొని, నాయకులు అడువల శ్రీధర్, రాయబారపు సురేష్, గణేష్ తదితర కార్యకర్తల సమిష్టి కృషితో ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. చేతుల్లో జాతీయ జెండాలు ధరించి దేశభక్తి నినాదాలతో సాగిన ఈ ర్యాలీ ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువతలో జాతీయ భావాలను రగిలించింది. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు సాయిని మల్లేశంను నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సమన్వయానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని కూడా ఆత్మీయంగా పలకరించి, పార్టీ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ అభినందించారు.

