వీధి వ్యాపారులకు బిగ్ రిలీఫ్: యూజర్ చార్జీలు భారీగా తగ్గిస్తూ జమ్మికుంట మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 14: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వీధి వ్యాపారులపై ఎలాంటి అనవసరమైన ఆర్థిక భారం పడకుండా యూజర్ చార్జీలను గణనీయంగా తగ్గించాలని మున్సిపల్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణంలో మున్సిపాలిటీ అందిస్తున్న పారిశుద్ధ్య, చెత్త సేకరణ , ఇతర ప్రజా సేవలను వ్యాపారులు వినియోగించుకుంటున్న నేపథ్యంలో, మొదట రోజుకు ₹100 చొప్పున నెలకు ₹3,000, సంవత్సరానికి ₹36,000 వసూలు చేయాలని ప్రతిపాదించారు. అయితే, వ్యాపారుల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు, కమిషనర్ , శానిటేషన్ సిబ్బంది సుదీర్ఘంగా చర్చించి, చార్జీలను రోజుకు కేవలం ₹11 (సంవత్సరానికి ₹4,800)గా ఖరారు చేస్తూ వ్యాపారులకు ఊరట కల్పించారు.ఈ వసూళ్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగుతుందని, వ్యాపారులు చెల్లించే ప్రతి రూపాయికి మున్సిపాలిటీ తరఫున తప్పనిసరిగా అధికారిక రసీదు అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. “వీధి వ్యాపారుల అభివృద్ధి – మున్సిపల్ అభివృద్ధిలో భాగస్వామ్యం” అనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యాపారులంతా సహకరించాలని కౌన్సిల్ కోరింది. నిర్ణయించిన చార్జీలను సక్రమంగా చెల్లిస్తూ, తమ వ్యాపార ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జమ్మికుంట పట్టణాన్ని మరింత సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

