పరకాలలో రూ. 424 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
హన్మకొండ/పరకాల,వి90 న్యూస్,ఆగస్టు 16: హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భారీ ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ యువత, విద్యార్థులు, మహిళలు, రైతులకు ఉపయోగపడేలా రూ. 400 కోట్లకు పైగా విలువైన పలు నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు, నిర్మాణ పూర్తి చేసుకున్న పలు భవనాలను అధికారికంగా ప్రారంభించారు.ఈ పర్యటనలో భాగంగా రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. దీనితో పాటు పరకాల మున్సిపాలిటీ పరిధిలో రూ. 82 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు, రూ. 65 కోట్లతో పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు నిర్మించే నాలుగు లేన్ల రహదారి పనులకు భూమిపూజ చేశారు. యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు రూ. 45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణానికి, దామెర మండలం ల్యాదేళ్లలో రూ. 32.17 కోట్లతో చేపడుతున్న పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్ నిర్మాణానికి సీఎం మార్గం సుగమం చేశారు.ఇక గ్రామీణ, పట్టణాభివృద్ధిలో భాగంగా అక్కంపేట గ్రామంలో రూ. 10 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక పనులకు, ఆత్మకూర్లో టౌన్షిప్ అండర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్కు, రూ. 5 కోట్లతో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి శంకుస్థాపనలు జరిగాయి. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ పరకాల పట్టణంలో రూ. 3 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, రూ. 1.10 కోట్లతో విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయ నిర్మాణ పనులను ప్రారంభించారు.అలాగే ప్రజలకు మెరుగైన వైద్య, విద్యా సదుపాయాలు అందుబాటులోకి తెస్తూ రూ. 35 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని, రూ. 5 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటితో పాటు ఆత్మకూర్లో రూ. 1 కోటి వ్యయంతో నిర్మించిన అధునాతన SPM సెంటర్ను ప్రారంభించి ప్రజాసేవకు అంకితం చేశారు.

