ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయి ఫోటోగ్రఫీ పోటీలో జమ్మికుంట ఫోటోగ్రాఫర్ రాంబాబుకు తృతీయ బహుమతి
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 19: 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఖమ్మం ఫోటోగ్రఫీ కాంటెస్ట్ 2026లో జమ్మికుంటకు చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబు ప్రతిభ చాటారు. రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి లో నిర్వహించిన ఈ పోటీల్లో “పండుగలు” అనే అంశంపై ఆయన తీసిన ఛాయాచిత్రం నిర్వాహకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆయనకు తృతీయ బహుమతి లభించింది.ఖమ్మంలోని టీఎన్జీవో భవనంలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఖమ్మం అడిషనల్ డీసీపీ బొజ్జ రామానుజం చేతుల మీదుగా రాంబాబు ఈ అవార్డును అందుకున్నారు.

గత నాలుగు దశాబ్దాలుగా ఫోటోగ్రఫీ రంగంలో కొనసాగుతున్న ఆయన ప్రకృతి, సంస్కృతి, సంప్రదాయాలు , లంబాడి గిరిజనుల జీవనశైలిని తన కెమెరాలో బంధించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు పొందారు. ఇటీవల హైదరాబాద్ కె.వి.ఆర్ పార్కులో తెలంగాణ అటవీ శాఖ నిర్వహించిన “కెమెరా కళ్ళు” పోటీలోనూ ఆయన రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు. ఉమ్మడి రాష్ట్రాల పోటీలో మరొక సారి ప్రతిభ చూపి బహుమతి సాధించిన రాంబాబును ఉభయ రాష్ట్రాల ప్రముఖ ఫోటోగ్రాఫర్లు, స్థానిక ప్రతినిధులు మరియు ఆయన శిష్యులు ఘనంగా అభినందించారు.

