జమ్మికుంట ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో కస్టమర్ అవగాహన సదస్సు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, బ్యాంకింగ్ సేవలపై కీలక సూచనలు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 20: జమ్మికుంట పట్టణంలోని ఇండియన్ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు , సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్రాంచ్ మేనేజర్ హరినాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో డిజిటల్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన సూచనలు చేశారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా నంబర్, ఏటీఎం పిన్, ఓటీపీ, పాస్వర్డ్ , సీవీవీ వంటి అత్యంత రహస్య వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని స్పష్టం చేశారు. అపరిచిత ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింక్లు , గుర్తుతెలియని యాప్ల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.అలాగే ఏటీఎం కార్డు వినియోగంలో పాటించాల్సిన నిబంధనలు, కార్డు పోయిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలు , ఖాతాలో ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనిస్తే తక్షణమే బ్యాంకును సంప్రదించాల్సిన ఆవశ్యకతను వివరించారు. దీనితో పాటు బ్యాంకు అందిస్తున్న వివిధ రకాల రుణాలు, గోల్డ్ లోన్ల వివరాలను తెలుపుతూ, రుణం పొందేముందు వడ్డీ రేటు, కాలపరిమితి, చెల్లింపు వాయిదాలు , ఇతర నిబంధనలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని సూచించారు.2018లో ప్రారంభమైన జమ్మికుంట ఇండియన్ బ్యాంక్ శాఖ ప్రస్తుతం రూ.200 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలతో ఖాతాదారుల నమ్మకాన్ని గెలుచుకుంటూ విజయవంతంగా సేవలు అందిస్తోందని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్, సిబ్బంది గణేష్, శ్రీకాంత్, హర్షలతో పాటు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు పాల్గొన్నారు.

