కమలాపూర్ డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ధ్వజం
హన్మకొండ/కమలాపూర్,వి90 న్యూస్, ఆగస్టు 20: కమలాపూర్ మండల కేంద్రంలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన 394 డబుల్ బెడ్రూం ఇళ్లను వెంటనే అర్హులైన పేదలకు కేటాయించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. వారం రోజుల్లో లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీలు పది రోజులు గడిచినా అమలుకు నోచుకోలేదని విమర్శించారు.

గృహ సముదాయాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి కనీస మౌలిక వసతులు పూర్తికాకుండా ఇళ్లను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించిన ఆయన, గూడూరు, మరిపల్లిగూడెం ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి ఉందన్నారు. అలాగే, ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, వెంటనే లబ్ధిదారుల ప్రొసీడింగ్స్ అందజేసి వసతులు కల్పించకపోతే అర్హులతో కలసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

