హన్మకొండ/ఎల్కతుర్తి,వి90 న్యూస్,ఆగస్టు 21: ఎల్కతుర్తి మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేపిన కారు డిక్కీలో యువతి మృతదేహం లభ్యమైన ఘటన మిస్టరీని పోలీసులు వేగంగా ఛేదించారు. గత రెండు రోజులుగా రహదారి పక్కన నిలిపి ఉంచిన ఒక కారు నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు తలుపులు తెరిచి చూడగా, వెనుక భాగంలోని డిక్కీలో ఒక యువతి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కారులో క్లూస్ టీమ్తో తనిఖీలు నిర్వహించగా, అక్కడ లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సెంటినరీ కాలనీకి చెందిన మానసగా గుర్తించారు.ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు, సదరు కారును అద్దెకు తీసుకున్న వ్యక్తిని సాఫ్ట్వేర్ ఉద్యోగి వినోద్గా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తమదైన శైలిలో విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వినోద్ వెల్లడించిన కథనం ప్రకారం.. కరీంనగర్లోని ఒక గదిలో మానసతో కలసి ఉన్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా ఫిట్స్ (మూర్ఛ వ్యాధి) వచ్చిందని, దంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపాడు.ఆమె హఠాన్మరణంతో తీవ్ర భయాందోళనకు గురైన వినోద్, పోలీసులకు దొరికిపోతాననే భయంతో మృతదేహాన్ని కారు డిక్కీలో దాచేసి, ఎల్కతుర్తి వద్ద కారును వదిలేసి పరారైనట్లు విచారణలో ఒప్పుకున్నాడు. స్థానికుల సమాచారంతో సకాలంలో స్పందించిన పోలీసులు కేసు మిస్టరీని త్వరగా ముగించారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, మానస మృతికి ఫిట్స్ కారణమా లేక వేరే ఏదైనా కోణం ఉందా అనే దిశగా సమగ్ర విచారణ జరుపుతున్నారు.


