మీడియా రంగంలో విశేష సేవలు: కొరపల్లి గ్రామానికి చెందిన గండి రంజిత్ కుమార్ గౌడ్ కు ‘తెలంగాణ స్ఫూర్తి నంది పురస్కారం’
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 13: ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వాటి పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తూ మీడియా రంగంలో రాణిస్తున్న కొరపల్లి గ్రామానికి చెందిన గండి రంజిత్ కుమార్ గౌడ్ కు అరుదైన పురస్కారం లభించింది. జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామానికి చెందిన ఆయనకు జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ‘తెలుగు వెలుగు సాహితీ వేదిక’ ఆధ్వర్యంలో వరంగల్ లోని టీఎన్జీవో భవనంలో “తెలంగాణ స్ఫూర్తి నంది పురస్కారాన్ని” ఘనంగా ప్రదానం చేశారు. మీడియా రంగంలో గత రెండు దశాబ్దాలుగా సుదీర్ఘ సేవలు అందిస్తున్న రంజిత్ కుమార్, సమాజంలోని విభిన్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, వాటిని అధికారుల దృష్టికి చేరవేసి పరిష్కరించే దిశగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. నిరంతరం సమాజ సేవలో భాగస్వామ్యమవుతూ ప్రజల మన్ననలు పొందుతున్న ఆయన సేవల గుర్తింపుగా ఈ గౌరవ పురస్కారానికి ఎంపికయ్యారు. గతంలో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సైతం రంజిత్ కుమార్ తన వంతు పాత్రను పోషించారు. స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను అప్పట్లో మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకువస్తూ విశేష సేవలు అందించారు. ఈ సందర్భంగా గండి రంజిత్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, తనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రాకతో సమాజం పట్ల , మీడియా రంగం పట్ల తన బాధ్యత మరింతగా పెరిగిందని, భవిష్యత్తులోనూ ప్రజల పక్షాన నిలిచి మరిన్ని సేవలు అందిస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

